
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ఆగస్టు 15లోపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాస్ బుక్, రేషన్ కార్డులున్నవారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు పలుచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటించడం జరిగిందన్నారు. ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు పేర్కొంటుండడంతో కొందరు సన్న చిన్న కారు రైతులు కూడా ఆదాయపన్ను చెల్లించడం జరుగుతుందని, కొందరు రైతులకు రేషన్ కార్డు లేకుండా ఉన్నారని, వారికి రుణమాఫీ వర్తించకుండా పోతుందని బెంగ పడుతున్నారన్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూనే తిరిగి కొత్త రుణాలను అందజేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు. ఎందుకంటే పలు రకాల కండిషన్ల పేరుతో రైతుల రుణమాఫీకి మోకాలడ్డేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతుందని, కనుక ఎలాంటి కండిషన్లు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కూడి ఉద్యమాలకు పూనుకోవాల్సి వస్తుందని కొండాల్ రెడ్డి హెచ్చరించారు.







