
-కెసిఆర్ పథకాల గురించి చెప్తుంటేనే…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట జూన్ 18 : జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం బిజెపి, కాంగ్రెస్ నేతలు చేశారు. కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు, రైతు బీమా ,24 గంటల కరెంటు, కాలేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలు వివరిస్తుండగా బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకసారిగా అడ్డు తగలడం విస్మయానికి గురిచేసింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తుండగా ఇరు పార్టీల నేతలు కుమ్మక్కై అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేగా అధికారిక పార్టీ కార్యక్రమంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని కౌశిక్ రెడ్డి వివరించారని దీన్ని అడ్డుకోవడం ప్రోటోకాల్ ను విస్మరించడమేనని మండిపడ్డారు. అలాంటప్పుడు కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారని, ఎందుకు ఎమ్మెల్యేను ఆహ్వానించారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసి, అపహస్యం చేస్తున్నారని ఇది శాసనసభ్యుల హక్కులకు ఉలంగాన కిందికి వస్తుందని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బిజెపి నాయకులు వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవాలని, అంతేకానీ ఎమ్మెల్యే ప్రసంగాన్ని ఆపాలని ప్రయత్నించడం వారి కుటిల రాజకీయ నీతికి దర్పణం అని పేర్కొన్నారు.






