
-ముగ్గురి అదృశ్యానికి..
ఆర్థిక వ్యవహారాలే కారణమా?..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 19: హుజురాబాద్ లో ఇటీవల కాలంలో ముగ్గురిలో ఒకరు చిరు వ్యాపారి, మరొకరు రాజకీయ కార్యకర్త, మరో వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించడంతో పాటు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల కాలంలో కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యంతో ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు అటు బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం వీరు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది.
మాయమైన రాజకీయ కార్యకర్త?
హుజురాబాద్ పట్టణానికి చెందిన నాయకుడు ఒకరు ఇటీవల కనిపించకుండా పోయారు. ఇతను ఆయా రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేశాడు. పట్టణంలో అందరికీ సుపరిచితుడు. కుటుంబంతో సహా వెళ్లిన ఇతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. గిరి గిరి(మిత్తిలకు)తో పాటు ఫైనాన్సు వ్యాపారం చేసిన ఇతను కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతినెల వడ్డీ డబ్బులు చెల్లిస్తుండడంతో వడ్డీకి ఆశపడి కొంతమంది ఇతనికి డబ్బులు ఇవ్వగా ప్రస్తుతం అతను అదృశ్యం కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సుమారు రూ. రెండు కోట్ల మేరకు ఇతను పలువురికి బకాయి పడ్డట్టు తెలుస్తోంది.
బేకరీ యజమానిగా నమ్మించి..
హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ కూడలికి దగ్గరగా ఉన్న ఓ బేకరీ షాపులో పనిచేసే ఓ వ్యక్తి ఇటీవల అదృశ్యమైనట్టు తెలుస్తోంది. జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి చెందిన బేకరీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇతను భాద్యత చేపట్టాడు. అయితే ఇతను ఎప్పుడూ కౌంటర్లో కనిపిస్తుండడంతో అందరూ బేకరీ తనదే అని నమ్మి అధిక వడ్డీ ఆశకు ఇతనికి కూడా డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పలువురి వద్ద లక్షలాది రూపాయలు ఇతను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతినెల వడ్డీ డబ్బులు చెల్లిస్తూ ఉండడంతో అతన్ని బాగా నమ్మారు. కానీ గత నెల రోజుల క్రితం అతను ఉన్నట్టుండి మాయమయ్యాడు. దీంతో బాధితులు జమ్మికుంటలో ఉన్న బేకరీ యజమాని వద్దకు వెళ్లగా.. అతన్ని కేవలం జీతగాడిగా మాత్రమే బేకరీలో పెట్టుకున్నానని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను.. తనకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలుస్తోంది. బేకరీలో ఉండే కర్ణాటకకు చెందిన వ్యక్తి మాయం కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే ఇతను తన స్వరాష్ట్రమైన కర్ణాటకకు అతను వెళ్లినట్టుగా భావిస్తున్నారు. రూ.80 లక్షల వరకు భాదితులకు రావాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.
విశ్రాంత ఉద్యోగి ఎటు వెళ్లినట్టు?
హుజురాబాద్ పట్టణంలో సుదీర్ఘకాలంగా నివసిస్తూ అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి ఓ సహకార సొసైటీలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి గత రెండు నెలలుగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఇతని అదృశ్యంపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇతని కుమారుడు ఆర్థిక లావాదేవీల్లో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇతనికి సంబంధించిన ఆస్తులు కూడా బ్యాంకులకు, ఫైనాన్సులకు, జమానతుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇతని అదృశ్యం పై మిస్టరీ ఇప్పటివరకు వీడలేదు. కుటుంబ సభ్యులు ప్రయత్నించిన ఆచూకీ ఎక్కడ లభ్యం కావడం లేదని తెలుస్తోంది. ఇతని సెల్లు మొదట హైదరాబాదులో ఆ తర్వాత శ్రీకాళహస్తిలో మాత్రమే సిగ్నల్ గుర్తించగా ఆ తర్వాత సెల్లు సిగ్నల్ కూడా గుర్తించలేకపోయారు. అప్పుల బాధ భరించలేక వేరే రాష్ట్రానికి పరారయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని ఉంటాడా అనే చర్చ పట్టణంలో కొనసాగుతోంది.
అయితే హుజరాబాద్ పట్టణంలో ఇటీవల కాలంలో ఆర్థిక వ్యవహారాల కారణంగా ముగ్గురు వ్యక్తులు అదృశ్యం కావడం వారి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాకపోవడం వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, బాధితులకు ఆందోళన కలిగించడమే కాకుండా సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పేద మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకుండా పెద్ద మొత్తంలో నగదుతో కూడాయించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురి మాయంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని సమగ్ర విచారణ జరిపితే కొంత పురోగతి ఉండే అవకాశం లేకపోలేదు.
