
-ట్రాన్స్ కో ఉద్యోగి ఎండీ షాబుద్దీన్ అరెస్ట్, విడుదల


స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్ జూన్20: ఓ మహిళను వేధించడమే కాక అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ట్రాన్స్ కో ఉద్యోగిపై ఈనెల 16న కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు, బాధితురాలు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని చెందిన ఓ మహిళ కొంతకాలంగా హుజూరాబాద్ లో టైలరింగ్ చేస్తూ బోర్నపల్లిలో జీవిస్తున్నది. ఈ క్రమంలో పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ కో ఉద్యోగి ఎండీ షాబుద్దీన్ కు, ఆమెకు మధ్య గతంలో పరిచయం ఏర్పడింది. సదరు మహిళకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడు. అంతేకాకుండా ఆ వివాహిత ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాగా అతడిపై గతంలోనే కేసు నమోదు చేసి అరెస్టు సైతం పోలీస్ లు చేశారు. అయితే మళ్లీ ట్రాన్స్ కో ఉద్యోగి షాబుద్దీన్ పాత కక్షాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 16న ఆమె నివసిస్తున్న బోర్నపల్లిలోని ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడన్నారు. చాకచక్యంగా అతని నుండి ఆమె తప్పించుకొని అతన్ని బాత్రూంలో బంధించి 100 కు ఫోన్ చేశానన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అదే రోజు సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లుగా బాధితురాలు తెలిపారు. ట్రాన్స్ కో ఉద్యోగితో తనకు, తన పిల్లలకు ప్రాణభయం ఉందని, అతని బారి నుండి తనను కాపాడాలని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటుంది.