
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు విష్ణువర్ధన్ రెడ్డి (45) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై అకస్మాత్తుగా మృతి చెందారు. విష్ణువర్ధన్ రెడ్డి భార్య, కొడుకుతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో గత కొన్నాళ్లుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు సమయంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ సభ్యులు పత్తి క్రిష్ణారెడ్డి స్వయానా సోదరుడు(తమ్ముడు). పత్తి విష్ణువర్ధన్ రెడ్డి పదేళ్లకు పైగా పాత్రికేయునిగా, సీనియర్ రిపోర్టర్ గా వివిధ పత్రికల్లో పని చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో సేవలందిస్తున్నారు. ఆయనకు గతంలో రెండు సార్లు గుండెపోటుకు గురికాగా చికిత్స పొంది బాగా అయ్యారు. నేడు తిరిగి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయి మృతి చెందడం పాత్రికేయ మిత్రులను కలచివేసింది.
జర్నలిస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి మృతి పత్రికా రంగానికి తీరని లోటు
-విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
స్వర్ణోదయం ప్రతినిధి జూన్ 28: జర్నలిస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి మృతి పత్రిక రంగానికి, ఆయన కుటుంబానికి తీరని లోటని, వివిధ పత్రికల్లో పనిచేసి..ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసిన ఆయన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తన కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం..ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ..రిపోర్టర్ వృత్తినే దైవంగా భావించి..నిరంతరం కలం అనే ఆయుధంతో ప్రజల గలాన్ని వినిపించిన జర్నలిస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన జర్నలిస్ట్ విష్ణువర్ధన్ రెడ్డికి సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించి, ఆయనకు వారు ఘనంగా నివాళులర్పించారు. రిపోర్టర్ వృత్తినే తన దైవంగా భావించిన విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంభం వీధిన పడాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. వెంటనే జర్నలిస్ట్ సంఘాలు స్పందించి మృతిచెందిన జర్నలిస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం ఇప్పించేలా కృషి చేయాలని వారు కోరారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు.







