
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై ఆ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు ఆయన అనుచరులు చేరిన వారిలో ఉన్నారు.
-ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్.. అనంతర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మిగిలిన ఒక్కరు కూడా త్వరలోనే పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీతో కలిసి అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట..! ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిందే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారిలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ లో చేరారు. మరో ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ సైతం అదేబాటలో ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ ఓటమితో కుంగిపోయిన బీఆర్ఎస్ శ్రేణులకు వేగంగా మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.







