
-పర్యావరణ పరిరక్షణ వేదిక అధ్యక్షులు కే పురుషోత్తం

స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యావరణ పరిరక్షణ వేదిక అధ్యక్షులు విశ్రాంత జిల్లా అటవీశాఖ అధికారి కే పురుషోత్తం పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ పట్టణంలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్, హన్మకొండ కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక వరంగల్ ఆధ్వర్యంలో విస్తృత సాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సభ్యుల చేరికను పురస్కరించుకొని అర్ధ సంవత్సరం నివేదికను సభ్యులకు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ… పర్యావరణ కాలుష్యంలో భాగమైన సింగిల్ యూత్ ప్లాస్టిక్ సంచుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తడిచెత్తను ఎరువుగా, పొడి చెత్తను మున్సిపాలిటీకి ఇవ్వడంపై సంస్థ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శబ్ద కాలుష్య నియంత్రణ, మట్టి వినాయకులను వాడడం, వనమహోత్సవంలో భాగంగా చెట్లు నాటడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. పర్యావరణ సమస్యలపై పోలీసు కమీషనర్, మున్సిపల్ కమీషనర్, కలెక్టర్లను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ, ప్రభుత్వ అధికారులు కృషి చేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. సంస్థ ప్రతినిధులు పుల్లూరి సుధాకర్, అనితారెడ్డి, పాలక మండలి సభ్యులుగా ఎంపికైన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పి.రవిబాబు, ప్రధాన కార్యదర్శి టి.శ్రవణ్ కుమార్, కోశాధికారి వి.సుధాకర స్వామి, మండల జాయింట్ సెక్రటరీ మండల పరుశరాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజ్ కుమార్, దామోదర్, వి.శ్రీనివాస్, జి.నరేష్, ఐ.నాగేశ్వరరావు, దేవాచారి, షిరాజుద్దీన్, ప్రొఫెసర్ పద్మ,కె.కవిత, ప్రొఫెసర్ కేశవరావు, ప్రొఫెసర్ సి.బి.రామారావు, ఉమామహేశ్వర రావు, రాజగోవిందు, కమలాకర్ స్వామి, ఉప్పలయ్య, బిల్ల మహేందర్, కె.ప్రకాష్, వెంకటస్వామి పాల్గొన్నారు.






Really happy with this online news