
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల శ్రీ సంతోషిమాత సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం వారాహిమాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ చైర్మన్ కొత్త అశోక్ రెడ్డి దంపతులు వారాహిమాత పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సంతోషిమాత అమ్మవారిని శాఖంబరి అలంకరణ అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాఖంబరిగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంతోషిమాత ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.










