
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై ఇటీవల జిల్లాకు చెందిన రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని నగర మేయర్ సునీల్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి దుయ్యబట్టారు. కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ… గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకున్న తీగల వంతనలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనబడుతున్న సునీల్ రావు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని విమర్శించి నిన్న పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా కలిసిన మేయర్ సునీల్ రావు జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలవడంలో మర్యాద పాటించకపోవడం శోచనీయం అన్నారు.
కరీంనగర్ అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటించి ఉంటే వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలన్నారు. కొంతమంది బిఆర్ఎస్ కార్పొరేటర్లను సునీల్ రావు బిజెపిలోకి పంపించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో జరిగిన అవినీతిపై మీ పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు ప్రస్తుత సునీల్ రావుకు మధ్య అంతర్యుద్ధం జరిగినది వాస్తవం కాదా అన్నారు. పూటకో పార్టీ మారే సునీల్ రావుది రాజకీయ విలువలకు కట్టుబడి ఒకే పార్టీలో కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ ని విమర్శించే స్థాయి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితంలో ఈ స్థాయికి ఎదిగిన సునీల్ రావు నేడు కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గడిచిన ఏడు నెలల్లోనే ప్రజలకు దగ్గరైన నాయకుడు పొన్నం ప్రభాకర్ అని పేర్కొన్నారు. బిజెపికి అమ్ముడుపోయి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజాక్షేత్రంలో నీకు దేహశుద్ధి తప్పదని పద్మాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి రెహమత్ హుస్సేన్, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, నాగుల సతీష్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.






