
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు రెండవ రోజు కొనసాగాయి. నిన్న బుధవారం జమ్మికుంట నుండి వచ్చిన ఒక వెర్రి కుక్క హుజురాబాద్ పట్టణంలో సుమారు 30 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచిన విషయం విధితమే. అదే కుక్క బోర్నపల్లి మీదుగా సైదాపూర్ మండలం చింతలపల్లికి వెళ్లి మళ్లీ గురువారం ఎలా వచ్చిందో తెలియదు హుజురాబాద్ కు చేరుకొని తెల్లవారుజామున పారిశుద్ధ్య విధులకు వెళ్తున్న గాంధీనగర్ కు చెందిన పర్లపేల్లి భాగ్య, మాడుగుల విజయలపై క్షణాల్లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అంతేగాక సానిటరీ సూపర్వైజర్ ఆరెల్లి రమేష్ ను సైతం కుక్క దాడి చేసి కరవడంతో గాయపడ్డాడు. అలాగే మామిండ్లవాడలో ఇరువురు పారిశుద్ధ్య సిబ్బందిని కరచి తీవ్రంగా గాయపరిచింది. ఒకేసారి వేరువేరు చోట్ల ఒకే కుక్క ఆరుగురు పారిశుద్ధ సిబ్బందిని కరవడం పలువురుని విస్మయానికి గురిచేస్తుంది. అదే కుక్క డిసిఎంఎస్ కాంప్లెక్స్ మీదుగా గాంధీనగర్ వైపు వెళ్తుండగా మున్సిపల్, కుక్కలు పట్టే ప్రత్యేక సిబ్బంది దానిని పట్టుకొని కర్రలతో బాధి చంపారు. గాంధీనగర్ కు చెందిన ఇద్దరిని ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపి వరంగల్ ఎంజీఎంకి పంపించారు. మామిండ్లవాడలో గాయపడ్డ ఇద్దరికీ స్థానిక పల్లె దవఖానలో ప్రథమ చికిత్స చేసి ప్రైవేటు ఆసుపత్రికి రేఫర్ చేశారు. కాగా వీది కుక్కలను పట్టుకునేందుకు హైదరాబాదు, వరంగల్ నుండి ప్రత్యేక సిబ్బందిని రప్పించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ తెలిపారు. రెండు మూడు రోజుల వరకు కుక్కలు పెంచుకునేవారు తమ సొంత కుక్కలను ఇంటిలోనే ఉంచుకోవాలని వీధులలో వదిలితే కుక్కలు పట్టేవారు వాటిని పట్టుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తరలిస్తారని వారు తెలిపారు. వీధి కుక్కల బారిన ప్రజలు పడకుండా రక్షించేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు కుక్కల బారిన పడకుండా ఉండేందుకు పిల్లలను వీధులలో ఒంటరిగా వదల వద్దనీ చెప్పారు. కుక్క కాటు నుండి ప్రజలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని చైర్ పర్సన్ స్పష్టం చేశారు. ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటుకు సంబంధించిన రాబిపూర్ ఇంజక్షన్లను, మందులను అందుబాటులో ఉండేలా అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు.









