
-కేసిఆర్ ప్రవేశపెట్టిన మహోత్తర పధకం కళ్యాణ లక్ష్మి
-డిసెంబర్ 9 నుంచి జరిగిన పెళ్లిలన్నింటికీ తులం బంగారం ఇవ్వాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బిడ్డల పెళ్లిల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోత్తరమైన కల్యాణలక్ష్మి అనే పథకాన్ని తీసుకు వచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఉంటుందని అన్నారు. కేసిఆర్ ఆలోచనతో కల్యాణ లక్ష్మి పథకం 50వేలతో మొదలై క్రమేపి 75 వేల నుంచి లక్ష 116 లు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా కళ్యాణ్ లక్ష్మీ పథకం కింద లక్ష 116 లతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని వెంటనే దానిని లబ్ధిదారులందరికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. దీంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చిన అన్నా అంటే నేనున్నానంటూ ఏలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, pacs చెర్మన్ పొనగంటి సంపత్, జమ్మికుంట కౌన్సిలర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు.







