
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థులు గురువారం ఫీల్డ్ ట్రిప్స్ లో భాగంగా పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేనేత సంఘంలో పనిచేస్తున్న నేత కార్మికులతో ముచ్చటించారు. పరిశ్రమలో పనిచేస్తున్న చాలామంది కార్మికులు తాము రోజంతా పనిచేస్తే 100 రూపాయలు వస్తాయని కుటుంబ పరిస్థితుల వల్ల మహిళలమైన మేము కూడా పనిచేస్తున్నామని తెలిపారు. అలాగే నేత కార్మికులు మాట్లాడుతూ రోజంతా పనిచేసిన గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. విద్యార్థులు పరిశ్రమలో పనిచేస్తున్న వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకొని ఇలాంటి ఫీల్డ్ వర్క్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని, బట్టలు నేయడంలో అడ్డు దారాలు, నిలువు దారాలు ఎలా అల్లుకుంటున్నాయో తెలుసుకున్నారు. అలాగే రాట్నం చుట్టే మహిళతో కూడా ముచ్చటించారు. ఆ తర్వాత రంగులు అద్దకం విభాగంలోకి వెళ్లి దారాలకు వివిధ రంగులు ఎలా వేస్తున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ తమ పిల్లలకు 10 రోజులు చెప్పిన చేనేత పరిశ్రమపై రానీ అవగాహన ఒక్క సందర్శనతో వచ్చిందని, పిల్లలు ప్రాక్టికల్ గా చూసి నేర్చుకున్నప్పుడే ఎక్కువ జ్ఞానం లభిస్తుందని, ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులతో చేపిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘం ప్రెసిడెంట్ ఎలిగేటి ఉపేందర్ ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతియాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, చేనేత సంఘం మేనేజర్ నక్క వైకుంఠం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







