
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని శ్రీ నాగేంద్రస్వామి దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొత్తపల్లి నాగేంద్ర స్వామిని వేలాదిమంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకొని దేవాలయ ప్రధాన అర్చకుడు పందిళ్ళ భాస్కర్ శర్మ, ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు తెల్లవారు జామునుండే క్యూ కట్టారు. భారీ ఎత్తున మహిళలు పుట్టలో పాలు పోవడానికి నాగేంద్ర స్వామిని పూజించడానికి ఆలయానికి చేరుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని నాగేంద్ర స్వామిని వేడుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయ కమిటీ వారు చక్కటి ఏర్పాట్లను నిర్వహించారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వద్ద పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిల్చొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకోవడం ఆలయ గొప్పతనానికి నిదర్శనం.










