Oplus_131072
–వేములవాడ-కొండగట్టు పుణ్యక్షేత్రాలకు కొత్త రైల్వే మార్గం కోసం కొట్లాడు..
–నియోజకవర్గ ప్రజలు
అంటే మీకు ఇంత చులకనా..?
–అభివృద్ధిపై దృష్టి పెట్టు..
సంచలనాల కోసం ప్రాకులాడకు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర మంత్రివర్గం శుక్రవారం 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసిందని, ఇందులో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక కొత్త రైల్వే లైన్ మార్గం కూడా సాధించలేక పోవడం కేంద్ర మంత్రి బండి సంజయ్ అసమర్ధతే కారణమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. కరీంనగర్ కు సంబంధించి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఒక ప్రతిపాదనైనా చేశారా.. మంజూరు కోసం కేంద్ర మంత్రులను కలిశారా.. ఏమైనా ప్రయత్నం చేశారా.. బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని రాజేందర్ రావు డిమాండ్ చేశారు. శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఒక్క ప్రాజెక్టు మంజూరు చేయించని దద్దమ్మ బండి సంజయ్ అని మండిపడ్డారు. బండి సంజయ్ మీకు దమ్ముంటే కేంద్ర మంత్రివర్గంలో కరీంనగర్ కు ఒక పెద్ద ప్రాజెక్టు మంజూరు చేయించేలా ఆమోదముద్ర వేయించాలని డిమాండ్ చేశారు. మొదటి సారి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా సాధించ లేకపోయారని పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది కొత్త మార్గాలకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
కరీంనగర్ పై మీకు ప్రేమ ఉంటే ఒక్క ప్రతిపాదన అయినా చేసి మంజూరు చేయించే వారని ధ్వజమెత్తారు.
మనోహరాబాద్ టు హైదరాబాద్, సిద్దిపేట టు సిరిసిల్ల-వేములవాడ కొత్తపల్లి రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు హర్శించే వారని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ ఏమి ఉపయోగమో అక్కడ ఆ పనులపై దృష్టి పెడితే ప్రజలు అది కాలాలపాటు గుర్తుంచుకుంటారని సూచించారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కరీంనగర్ ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు. ప్రతిసారి కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను గందరగోలానికి గురి చేసే విధంగా ప్రవర్తించడమే మీ నైజామా అని ప్రశ్నించారు. భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం నిర్మిస్తున్నట్లుగా, వేములవాడ- కొండగట్టు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త రైల్వే లైన్ మార్గాన్ని మంజూరు చేయించాలని బండి సంజయ్ కు సూచించారు. వేములవాడ- కొండగట్టు ఆలయాలకు నిత్యం ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారని పేర్కొన్నారు. వారి సౌకర్యార్థం రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ పుణ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు మార్గం అనుసంధానం కానుందని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం వల్ల వేములవాడ-కొండగట్టు ప్రాంతాలు పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చెందుతాయని సలహా ఇచ్చారు.
మీడియాలో సంచలనాల కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడమే నేర్చుకున్నారని విమర్శించారు. సంచలనాల కోసం ప్రాకులాట మానుకోవాలని హితవు పలికారు. మళ్లీ రెండోసారి ప్రజలు మోసపోయి గెలిపిస్తే అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. మొదటి ఐదేళ్ల కాలంలో చేసిన తప్పిదాన్ని మళ్లీ బండి సంజయ్ చేస్తున్నారని, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న దృష్ట్యా కరీంనగర్ ప్రజలు జీవిత కాలం మర్చిపోలేని అభివృద్ధి పనులను చేసి చూపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కరీంనగర్ కు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పెద్ద ప్రాజెక్టు మంజూరు చేయించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు తీసుకు రావాలని రాజేందర్ రావు పేర్కొన్నారు.






