
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని వరంగల్ రోడ్ హెచ్ పీ పెట్రోల్ పంపు ఎదురుగా గల పాండ్రాల నాగరాజుకు సర్వే నెంబర్ 2420 లోగల 21 గుంటల వ్యవసాయ భూమి ఉండగా అందులో మూడు గంటల భూమిని బిఎస్సార్ గార్డెన్ వారు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హుజరాబాద్ లో నివాసం ఉంటున్న నాగరాజు తన భూమిని గతంలో కూడా ఇదే విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించానని, కోర్టు తీర్పు కూడా తనకే సానుకూలంగా ఉందని నాగరాజు చెప్పుకొచ్చారు. దీంతోపాటు గత 15 రోజుల క్రితం హుజురాబాద్ ఆర్డిఓ, ఎంఆర్ఓలతో సర్వే జరిపించి కబ్జాకు ప్రయత్నించిన భూమి తనకే చెందుతుందని వారు కూడా దగ్గరుండి హద్దులు చూపించి వెళ్లారని అన్నారు. అనంతరం తమకు సంబంధించిన భూమిలో నాటు కూడా వేశామని అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో తాము వేసిన పంట పొలం నాశనం చేస్తూ తిరిగి ఫంక్షన్ హాల్ కు టిప్పర్లతో మట్టి పోయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. బిఎస్ఆర్ గార్డెన్ వారికి ఎలాంటి ఆధారాలు లేకున్నా తమ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిఎస్ఆర్ గార్డెన్ కి వెళ్లేందుకు దారి లేకపోతే దారి కోసం తమ భూమిలోని కొంత భాగాన్ని విక్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ వినడం లేదని అన్నారు. తన భూమిని కబ్జాకు ప్రయత్నించడంతో పాటు పంటపొలాన్ని నాశనం చేసినందున శనివారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో బిఎస్ఆర్ గార్డెన్ వారిపై కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.









