
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటారు…!!
రాఖీ పౌర్ణమి చారిత్రక నేపధ్యం, విశిష్టత తెలుసా…??
సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అయిన రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్ట్ 19 వ తేదీన వస్తుంది. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కాతమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ విశిష్టత, చారిత్రక నేపధ్యం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి…!!
రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమకు ప్రతీక…!!
ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా, పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీని జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు…!!
రాఖీ పురాణ కథలు ఇలా…!!
ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపధ్యం ఉంది. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది…!!
దేవేంద్రుడికి రాఖీ కట్టటంతో మొదలైన సాంప్రదాయం…!!
అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది . ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా, అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ అయ్యింది…!!
కృష్ణుడికి ద్రౌపది రాఖీ…!!
శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడువేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది…!!
బలిచక్రవర్తి కథ…!!
ఇక బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువును పాతాళలోకానికి తీసుకువెళ్ళిన సమయంలో, ఆయనను తిరిగి తీసుకు రావటం కోసం లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టే నేటికీ అందరూ దీనిని ఘనంగా జరుపుకుంటున్నరు.


