
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ పి విజయేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ టీజీ ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ పి విజయేందర్ రెడ్డి హుజురాబాద్ డివిజన్లో పెద్దపాపయ్యపల్లె సెక్షన్ లో విద్యుత్ ఉద్యోగులకు సేఫ్టీ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించారు. అనంతరం పొలం బాట కార్యక్రమంలో రైతులకు విద్యుత్ పై ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ విధంగా వివరించారు. తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు. విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు. విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను. పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు. బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి. కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు. చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి. క్వార్టర్ లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు. గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను. వర్షం పడుచున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి JLM, ALM, LM లేదా AE దృష్టికి తీసుకెల్లాలి అని తెలిపారు.







