
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, అక్టోబర్ 06: హుజురాబాద్ పట్టణంలోని నవ భారతి విద్యాలయంలో 1998 -1999 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హుజురాబాద్ లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులు మొదటి గురువులని తదుపరి విద్యను బోధించిన గురువు రెండవ గురువని విద్యార్థులు అన్నారు. నవ మాసాలు మోసి కనీ పెంచినది తల్లి అయితే, భాహ్య ప్రపంచాన్ని గురించి, భాష, భావన, క్రమశిక్షణ, మంచి నడవడిక తెలియజేసేది గురువు. గురువు అనేవాడు సన్మార్గంలో నడిపించేవాడు, గురువే ఆదిమూలమని విద్యార్థులు ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ భారతి విద్యాలయం ప్రధానోపాధ్యాయులైన తిప్పర్తి రమణారెడ్డి – వనమాల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ప్రధానోపాధ్యాయ దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే ప్రధానోపాధ్యాయ దంపతులను ఉపాధ్యాయ బృందం కూడా శాలువాతో సన్మానించి సత్కరించారు. అలాగే విద్యార్థులు కూడా ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సభ విజయవంతం కావడానికి విద్యార్థి సాయిరి రవికుమార్ చాలా శ్రమ పడ్డాడని, విద్యార్థిని, విద్యార్థులు ఎక్కడో నలుమూలగా ఉండే వారిని ఏకీకృతం చేసి వారి సమాచారాన్ని సేకరించి ఒక వేదిక మీద ఏర్పాటుకు కృషి చేసినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తిప్పర్తి రమణారెడ్డి, లింగారావు, శ్రీనివాస్ రెడ్డి, మొండయ్య, విడపు శ్రీనివాస్, కామారపు శ్రీనివాస్, డింగరి సుప్రసన్న కుమార్, కుడికాల సురేష్, అజ్మత్ అలీ, మాడిశెట్టి వీరన్న, కేసరి మధుకర్ రావు, రాజిరెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

