
–సమగ్ర కులగణన సర్వే దేశానికే ఆదర్శం.
-దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి.
-ఆందోళన వద్దు,500 బోనస్ ఇచ్చి తీరుతాం.
-ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యలకు ప్రజాప్రభుత్వంలో పరిష్కారం అయ్యేలా కృషి.
-ఎమ్మెల్యే భూ కబ్జాల బాగోతం ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం.
-కౌశిక్ నువ్వొక రాజకీయ బచ్చావి,కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు.
-ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకత పాటిస్తాం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత కొన్నిరోజులుగా హుజురాబాద్ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రంగా ఖండించారు. గురువారం హుజురాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ అభివృద్ధిపై మేము దృష్టిసారిస్తే ఒక్క రూపాయి కూడా పనిచేయకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కబ్జాలకు వంతపాడుతూ, రాజకీయపబ్బం గడుపుతున్నారని ఎద్దేవాచేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో రాహుల్ గాంధీ సూచనల మేరకు రేవంత్ రెడ్డి సారథ్యంలో సమగ్ర కులగణన చేపడుతున్నామని దీనికి ప్రతి ఒక్కరు తమ వివరాలను అధికారులకు తెలుపాలని కోరారు. రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉండి, ప్రభుత్వ విప్ గా ఉండి దళితులను మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఇప్పుడు టెంట్ వేసుకొని కూర్చోవడం చంపినోడే సంతాపం తెలిపినట్టుగా ఉంటుందని అన్నారు. కౌశిక్ రెడ్డి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుందని, ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప దళితుల కోసం ఏనాడు ఆలోచించలేదని, మరోసారి కౌశిక్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని దళితులకు తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని త్వరలో రెండవ విడత దళిత బంధు అందజేస్తామని, మునుపటిలాగా దళారివ్యవస్థ లేకుండా చూస్తామని ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు సంభందించి అన్ని వివరాలు సమర్పించామని అన్నారు. అలాగే వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని, చెప్పిన మాట ప్రకారం రైతులకు సన్నవడ్లకు క్వింటాకి రూ.500 బోనస్ ఖచ్చితంగా ఇస్తామని, దీనిపై రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కొనుగోలుపై మంత్రులు, కలెక్టర్, నేను సమీక్ష జరిపామని కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. రుణమాఫీ విషయంలో ఇప్పటికే 2లక్షల వరకు మాఫీ అయ్యాయనీ, సాంకేతిక కారణాల వలన రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ఇప్పుడు దాన్ని సర్దిద్దుకుంటున్నామని అన్నారు. ఈసారి వర్షాలు కొంత ఆలస్యంగా పడడం వల్ల చెరువులో చేపలు కలపడం లేట్ అయిందని అయినా కూడా ఇప్పటివరకు 50 శాతం పూర్తి చేసామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా తెలవని, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో రొయ్యపిల్లలను ఎక్కడ కలిపారో చూపించాలని కోరారు. తన సొంత మండలమైన వీణవంకలో సాక్షాత్తు ఎమ్మెల్యే, అతని అనుచరుడు భూకబ్జాలకు పాల్పడ్డాడని ప్రణవ్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉంటున్న శివప్రియ భూమి ఆక్రమణ చేసి తద్వారా సంబంధిత ఎమ్మార్వోను ఒత్తిడి చేసి సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని ఇది నిజం కాదా చెప్పాలని కోరారు. వీణవంక మండల రెవెన్యూ అధికారి,ధరణి ఆపరేటర్ సస్పెండ్ అయ్యారని దీనికి సమాధానం చెప్పాలని, ఒక్కొక్కటిగా హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి చేసిన భూ దందాలు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏల్లుగా పరిష్కారం కానీ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపిస్తున్నామని అందులో భాగంగానే హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ వారు అడగగానే ఎంత కష్టమైనా పదిలక్షల రూపాయలతో వాకర్స్ ట్రాక్, పాఠశాల మైదానానికి గేట్ అమలుకు ఉత్తర్వులు మంజూరు అయ్యాయని అన్నారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధికి మరింత బాధ్యతగా పనిచేస్తామని కౌశిక్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు విషయంలో కూడా పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని హుజురాబాద్ లో అంగుళం కూడా నడవకుండా అడుగు అడుగుకు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







