
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళిత బంధు కోసం పోరాడే మేమంతా దేశద్రోహులం కాదని, దళితులమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, కరీంనగర్ పర్యటనలో భాగంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 5000 మంది దళితులకు రెండో విడత దళిత బంధు రాలేదని, వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసి ప్రభుత్వం రెండో విడత ఆపివేశారని అన్నారు. వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి రెండో విడత దళిత బంధు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత బందు కోసం పోరాడితే తామేమి దేశద్రోహం కాదని, తమకు రెండో విడత దళిత బంధు అందిస్తే ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేస్తామని ఆయన ప్రశ్నించారు. దళిత బందు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే తమపై కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దళితులందరికీ దళిత బంధు అందిస్తే రోడ్లు ఎక్కాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల పట్ల వివక్ష చూపకుండా వెంటనే దళిత బంధు అందరికీ అందించాలని ఆయన కోరారు.

