
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నేడు హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరపత్రికను తెలంగాణ అంబేడ్కర్ సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. నవంబర్ 26న భారత రాజ్యాంగం దినోత్సవం పురస్కరించుకొని భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల నవంబర్ 26 మంగళవారం రోజున భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్లతో యాత్ర ఉంటుందని ఈ యాత్ర ఎల్కతుర్తి మండలం నుంచి మొదలుకొని భీమదేవరపల్లి , అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మీదుగా హుస్నాబాద్ చేరుకొని అంబేడ్కర్ చౌరస్తాలో ముగింపు సభ ఉంటుందన్నారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల కోసం అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కొందరు మనువాదులు, బూర్జవ నాయకులు రాజ్యాంగంను మారుస్తామని బహిరంగం ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్ విగ్రహాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంబేడ్కర్ పేరు మీదుగా విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పుట్టినరోజును ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించారని, అంతటి మహామేధావుని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నారన్నారు. ఆ మహానీయుడి ఆశయాల కోసం అనునిత్యం కొనసాగిస్తూ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో తెలంగాణ అంబేడ్కర్ సంఘం తరఫున కమిటీలు వేస్తూ ప్రజలను చైతన్య పరిచేవిధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాక రమేష్, నేతలు వేల్పుల రత్నం, తునికి సమ్మయ్య, శనిగరం భాస్కర్, బత్తుల రాజలింగం, వేల్పుల ప్రభాకర్, ఆకునూరి సారయ్య, వేల్పుల భాస్కర్, ఎర్ర కార్తీక్ ,వేముల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

