
–మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత కొన్నాళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో పోలీస్ పెద్దలు
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల బంజారా హిల్స్ సీఐ, పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం అత్యంత దారుణమని హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కొండల్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి పట్ల స్థానిక సీఐ, పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక ఆయన సహనాన్ని పరీక్షించారని, రెచ్చగొట్టి మరి తనను కేసులో ఇరికించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఫై అక్రమ కేసులు బనాయించారన్నారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, జి జగదీశ్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడంను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన ప్రభుత్వం కేసును ఉపసంహరించుకొని తక్షణమే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాక అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులు బనాయించిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలపై, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని కొండాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకుడు సంగేమ్ సత్యనారాయణ ఉన్నారు.






