
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. బుధవారం ఇక్కడ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భారతరత్న వాజ్ పాయ్
శతజయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పార్లమెంటులో ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి వదులుకొని నైతిక విలువలకు మించింది లేదని ఆయన నిరూపించారని చెప్పారు.
రాజనీతికి నిలువుటద్దం, రాజీ ఎరుగని దేశభక్తుడు, నిజాయితీ, నిబద్ధత గల అజాత శత్రువుగా, స్టేట్స్ మెన్ గా,పార్టీలకతీతంగా కమ్యూనిస్టులతీ సహా వాజపేయిని ఆదర్శ రాజకీయ నాయకుడిగా కొనియాడే వారని, భారత జాతి గర్వించదగ్గ మహా నేత రాజకీయ భీష్మ పితామహుడు, అటల్ బిహారీ వాజపేయి అని, ప్రతిపక్ష నేతగా, ప్రధానిగా, అత్యున్నత విలువలను ఆయన రాజకీయాలలో పాదుకొల్పారని రామారావు చెప్పారు. పదిసార్లు లోక్ సభ సభ్యునిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా
ఉన్న వాజపేయి నేడు ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని, రహదారుల అనుసంధానం వల్లనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని భావించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రతి ఊరుకు రోడ్లు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
వాజపేయి దూర దృష్టి వల్లే నేడు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ, అభివృద్ది పథంలో దూసుకు వెళ్లగలుగుతున్నామని కొనియాడారు. టెలికాం, టీవీ, ఇంటర్నెట్, విద్యుత్, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేస్, వ్యవసాయ, ఐటీ పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఆయన వేసిన బాటలే కారణం అన్నారు.శత్రుదేశాలను సైతం మిత్ర దేశాలుగా మలుచుకున్న
వాజ్ పాయ్ ని దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని, అదే మనం వాజపేయికి ఇచ్చిన ఘన నివాళి అని, నేటి యువతరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పోలాడి రామారావు పేర్కొన్నారు.

*దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్*

ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు





