
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ ; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకమని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈరోజు బంజారాహిల్స్లోని తన నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ శ్రేణులకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ, ప్రతి ఓటు కీలకమని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ లాంటివని, వీటిలో విజయం సాధించడం ద్వారా మరింత బలమైన మెసేజ్ వెళ్లొచ్చని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు తెలియజేయాలని సూచించారు.
ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయ నియామకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. మొత్తానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విజయానికి దోహదపడేలా ఉపయోగించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎన్నికల వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించగలమని నేతలకు దిశానిర్దేశం చేశారు.
