
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ సామాజిక ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువతకు కూడా వర్తింపజేయాలనే మా విన్నపాలను రాష్ట్ర ప్రభుత్వ పాలకులు సానుకూలంగా స్పందించి అధికారికంగా ఆదేశాలు జారీ జేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య తరపున దన్యవాదాలు తెలుపుతున్నట్లు ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు.
బుధవారం కరీంనగర్ లోని సమాఖ్య కార్యాలయంలో ఐకాస నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రామారావు మాట్లాడారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమని ఈ పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యువతకు వర్తింప జేసినట్లుగా ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ సామాజిక వర్గాల ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు వర్తింప జేస్తూ మార్చి 25, మంగళవారం జీఓ. ఎంఎస్ నెం.7 ద్వారా ఆదేశాలు జారీ జేయడం హర్షనీయమని పోలాడి రామారావు అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆర్ధికంగా వెనుకబడిన అన్ని వర్గాల పేదలకు స్వయం ఉపాధి, సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమన్నారు. పేదరికం అనేది కేవలం కులానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని కులాల్లో కోట్లకు పడగలెత్తిన మనుషులు ఉన్నారని, అలాగే రెక్కాడితే గానీ డొక్క నిండని కడు నిరుపేదలు అన్ని కులాల్లో ఉన్నారని, కేవలం కులాన్ని ఆధారం చేసుకుని పేదరికాన్ని అంచనా వేయడం సరికాదని రామారావు అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు కోసం కొందరు కుహనా మేధావులు కులాల మధ్య వివక్ష చూపడం సరికాదని ఆర్థిక స్థితి గతుల ఆధారంగా అన్ని వర్గాల పేదలకు ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నదే తమ ధ్యేయమని ఈ లక్ష్య సాధనకు ఎన్నో ఏళ్లుగా ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య వివిధ రాజకీయ పార్టీలతో, వివిధ కుల సంఘాల పెద్దలతో, విద్యార్థులతో ప్రజా ప్రతినిధులతో, ఉన్నతాధికారులతో అన్ని వర్గాల సామాన్య ప్రజలతో మేధావులతో మమేకమై సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి సమన్యాయం కోసం సానుకూలంగా మద్దతు పొందామని సానుకూలంగా స్పందించిన అందరికీ పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు.

ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

అధికారికంగా ఆదేశాలు జారీ జేసిన ప్రభుత్వం