
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఓకే రోజు ఒకే సమయంలో రెండు చోట్ల దొంగలు తెగబడ్డారు. రెండు చోట్ల కౌంటర్లో దాచిపెట్టిన రూ. 25వేల నగదు చొప్పున మాయం చేయగా అలాగే విలువైన వెండి, కిరాణా వస్తువులను కూడా తీసుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం అండ్ జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలో చొరబడ్డ దుండగులు కౌంటర్లోని 25వేల నగదును ఇతర విలువైన కిరాణా సామాను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. అలాగే వరంగల్ రోడ్డులోని దేవి సిల్క్స్ పక్కన ఉండే పరమేశ్వర ఎలక్ట్రికల్ అండ్ వైన్డింగ్ దుకాణంలో షట్టర్ తాళాలు తీసి కౌంటర్ లో దాచిన రూ .25వేల నగదు, ఐదు తులాల వెండిని దొంగిలించినట్లు షాప్ యజమాని భగవాన్ రెడ్డి తెలిపారు. అయితే ఎలక్ట్రికల్ షాప్ వద్ద అమర్చిన సీసీ కెమెరాలలో దొంగ తాళాలు తెరిచే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 3. 30 నిమిషాల సమయంలో చోరీ జరిగినట్లుగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. అలాగే అన్నపూర్ణ చౌరస్తాలోని రాఘవేంద్ర కిరాణం వద్ద 2 గంటల 30 నిమిషాలకు చోరీ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఒకపక్క రాత్రి వేళలో పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పటికీ ప్రధాన రహదారిలో బస్టాండ్ పక్కనే కూతవేటు దూరంలో ఉండే రెండు దుకాణాలలో గంట తేడాతో రెండు చోట్ల చోరీకి తెగబడడం పలువురిని భయాందోళనకు గురిచేస్తుంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి సీసీ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకొని దాని ఆధారంగా బాధితుల ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనాప్పటికీ పట్టణంలో ఒకేసారి రెండు చోట్ల చోరీ జరగడం ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది.


పరమేశ్వర ఎలక్ట్రికల్స్ అండ్ సానిటరీ వద్దా చోరీ దృశ్యం..

దొంగలు కౌంటర్ తాళాలు పగలగొట్టి 25వేల నగదు, వెండి చోరీచేసిన కౌంటర్ ఇదే..