Oplus_131072
– నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి జడ్జిగా ఎంపికైన మానస
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 30: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన యువతి బత్తుల మానస జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. బత్తుల నర్మద స్వర్గీయ మల్లేశంల కుమార్తె మానస ఎలుకతుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ హుజురాబాద్ లోని మాతృశ్రీ జూనియర్ కళాశాలలో, డిగ్రీ హుజురాబాద్ జాగృతి డిగ్రీ కళాశాలలో, పీజీ సోషియాలజీ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో, అలాగే ఎల్.ఎల్.బిని కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో పూర్తిచేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన మానస ఇటీవలే రాత పరీక్షను రాసి జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో మొత్తం 43 మంది అభ్యర్థులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కాగా మనస పదమూడో ర్యాంకు సాధించింది. స్థానికంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న మనోజ్ కు మానస మేనకోడలు అవుతుంది. పేదరికం తో పోరాడి కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై లక్ష్యాన్ని సాధించిన మానసను గ్రామస్తులు, విద్యావంతులు, ప్రముఖులు అభినందిస్తున్నారు.






