
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీనియర్ సిటిజన్ , ప్రజా సంఘాల నాయకుడు పోలాడి రామారావు శుక్రవారం మీడియా ముందు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు ఆహ్లాద కరమైన ప్రశాంత వాతావరణం, అధునాతన మౌలిక వసతుల కల్పించి అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ టీచర్లను ప్రభుత్వం నియమించి ప్రత్యేక శ్రద్ధతో రోజూ మానిటరింగ్ చేస్తూ గతంలో లాగా విద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులచే విద్యాబోధన గురించి పరిశీలించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ముందుకు వస్తున్న ప్రజలు ప్రభుత్వ బడులు, కళాశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్కూళ్ళల్ల్లో, కళాశాలల్లో తమ పిల్లలను చేర్పించి కాపాడుకోలేక పోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు అడ్మిషన్లు లేక మూత పడే ప్రమాదం ఏర్పడుతుందని ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు.
ప్రభుత్వ విద్యాదికారులు కూడా విద్యా బోధనలో సులువైన మంచి ప్రమాణాలు పాటించే విధంగా పిల్లల దృష్టంతా చదువు పైనే ఉండే విధంగా శ్రద్ధ వహించాలని, స్కూళ్ళలో, కాలేజీలలో ప్రభుత్వ ఉపాద్యాయులు, లెక్చరర్లు విద్యార్థులకు వారి బోధన సులభతరంగా ఉత్తమంగా ఉండాలని, ఉపాద్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ఇతరులకు మార్గ దర్శకంగా ఉండాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాష నేర్పించే అనువైన అధునాతన వాతావరణం పిల్లలకు ప్రభుత్వం కల్పించాలని రామారావు కోరారు. సైన్స్ ప్రయోగశాల సౌకర్యం, పిల్లలకు మంచి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని అవసరమైతే ప్రత్యేక తరగతుల తో పాటు వ్యక్తిగత ప్రత్యేక శ్రద్ధను ఉపాద్యాయులు తీసుకోవాలని రామారావు సూచించారు.
మనో వికాసాభివృద్ధికై సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించి మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా కృషిచేయాల్సిన బాధ్యత ఉపాద్యాయులు, లెక్చరర్లమీద ఉందని రామారావు అన్నారు గురుకులాల మీద శ్రద్ద పెడుతున్న ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలపై అలక్ష్యం చేయడం తగదన్నారు. దీనిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయని ప్రభుత్వ ఉన్నత విధ్యాధికారులు తక్షణం స్పందించి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలల బస్సులు కట్టడి చేయాలని ఇందుకు గ్రామ పెద్దలు కృషి చేయాలని రామారావు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలలు మూతపడుతున్నాయని ఇది ఆందోళన కలిగించే విషయమని, తక్షణమే సమిష్టిగా అధికారులు, ఉపాద్యాయులు , మనమందరం దృష్టి పెడితేనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మనుగడ ఉంటుందని ఇది మన బాధ్యత అని పోలాడి రామారావు పేర్కొన్నారు.
