
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో బక్రీద్ వేడుకలను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతి ముస్లిం పాటించాలన్నారు. శాంతియుతంగా జీవించాలని, పేదలకు సాయం చేయాలని ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థనల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పూర్వికుల సమాధుల వద్ద ప్రార్థనలు చేసారు. ఈ సందర్భంగా జామే మస్జిద్ ఈద్గా & మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ మున్సిపల్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియాన, సౌండ్ సిస్టం, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినందుకు మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్యకి మరియు సిబ్బందికి, పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన హుజురాబాద్ ఎసిపి మాధవికి, సిఐ కరుణాకర్ గౌడ్, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈద్గాలోని ప్రత్యేక ప్రార్థనలలో మత గురువు ముఫ్తీ షాకీర్, జామే మసీద్ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

