
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 7 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన నాగార్జున డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు తన డైరీకి పాలు సరఫరా చేసే హుజూారాబాద్ మండలం మంతెనపల్లికి చెందిన పాడి రైతు మంతెన అయిలయ్య కుమార్తె సుకన్య వివాహానికి హాజరై పుస్తె మట్టెల కింద నగదును అందజేశారు. ఈ సందర్భంగా రూ. 10,116 అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ నాగార్జున డైరీకి పాలు సరఫరా చేసే ప్రతీ గ్రామంలోని పాడి రైతు కుటుంబంలోని కుమార్తె వివాహానికి బంగారు పుస్తె, వెండి మట్టెలు అందించడం డైరీ పెట్టినప్పటి నుండి ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. డైరీ సభ్యులను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవడానికి ఈ చక్కని పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాగార్జున డెయిరీకి పాలు సరఫరా చేసే ప్రతి గ్రామం నుండి, ప్రతి పాడి రైతు ఆడబిడ్డ వివాహానికి డెయిరీ ద్వారా “పూస్తే మట్టెలు” బదులుగా రూ. 10,116 అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 577 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ. 58,36,932 సహాయం అందించామని వివరించారు.
నాగార్జున డెయిరీ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరిస్తూ, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు, సాధారణ బీమా, ప్రమాద బీమా, లక్ష రూపాయల పశువుల బీమా, వైద్య సదుపాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందునే పాడి రైతులు తమను కుటుంబ సభ్యులుగా భావించి తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ రంగంలో అత్యధిక పాల సేకరణ కలిగిన డెయిరీ నాగార్జున డెయిరీ అని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ గణేష్ రావు, డెయిరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీధర్ రావు, స్థానిక ఏజెంట్ నరేందర్ రెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

