
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేసి ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచడాన్ని ఎబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయనీ మళ్ళీ చార్జీలను పెంచాలని చూడటం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేనాని అన్నారు. ఫ్రీ బస్ కారణంగా సరిపడ బస్ లు లేక విద్యార్థులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నారనీ, విద్యార్థులకు సరిపడ బస్సులు నడపడం చేత కానీ అధికారులు బస్ పాస్ చార్జీలు మాత్రం పెంచడానికి సిద్ధం అవుతున్నారన్నారు. ఎబివిపి గతంలో అనేకసార్లు విద్యార్థులు ఎక్కువ ప్రయాణించే దారుల్లో బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసిన ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ హామీ కారణంగా వస్తున్న నష్టాన్ని భర్తీ చేయటానికే విద్యార్థుల మీద భారం మోపుతోందని ఎబివిపి భావిస్తుందన్నారు. ఒక వైపు బస్సులు లేక మరోవైపు విపరీతమైన చార్జీలతో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్ళే అవకాశం తగ్గిపోతుందని,
అధికారులు బస్ పాస్ ఛార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు పాత బస్ పాస్ చార్జీలే నిర్ణయించాలని ఎబివిపి డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్యన్, నగర ఉపాధ్యక్షులు వినయ్, రాకేష్, తేజ, శేఖర్ తదితరులు పాల్గోన్నారు.


ఆర్టీసీ టిఐ 2 సారయ్యకు వినతిపత్రం ఇస్తున్న ఏబీవీపీ నాయకులు..