
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్ అన్నారు. శనివారం హుజురాబాద్ లోని శ్రీరామ హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ శిబిరానికి హుజురాబాద్ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ఎఫ్ బిఎస్, పిఎల్ బిఎస్ ఉచిత పరీక్షలతో పాటు ప్రతి మంగళవారం ఉచితంగా ఓపి చూస్తామని అన్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తాగే నీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారు. నేటి సమాజంలో చాలామంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారని, షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలని కోరారు. షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగితే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి నెలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు. ఉచిత వైద్య శిబిరం ద్వారా సుమారు 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ఆస్పత్రి యాజమాన్యం నంబి భరణి కుమార్, ముష్కే శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




శ్రీరామ ఆస్పత్రికి తరలివచ్చిన ప్రజలు…


ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్న ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్





