
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర రైతు చట్టాలను రూపొందించి వాటి అమలుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర చట్టాలు లేకపోవడం మూలంగా రైతు అప్పుల పాలవుతూ వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ అమలు చేయలేమని చేతులెత్తేసిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుకు అదనంగా రెండింతలు సీటు కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు శాస్త్రీయ మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపడే విధంగా ఎరువులు సరఫరా చేయాలని, రాష్ట్రానికి యూరియా కోత విధించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భూభారతిలో రైతు సమస్యలకు పరిష్కారం మార్గం రాష్ట్ర ప్రభుత్వమే చూపెట్టాలన్నారు. సదా బైనమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని డిస్ట్రిబ్యూటర్లతో అధికారులు మిలాకత్ అయ్యారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో స్టాక్ పాయింట్లు తనిఖీలు నిర్వహించి జిల్లా రైతాంగానికి సరిపడే విధంగా యూరియా నిల్వలు ఉంచాలని డిమాండ్ చేశారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం సేకరించి నాలుగు నెలలు గడిచిన నేటికీ రైతుల అకౌంట్లో డబ్బులు వేయలేదని, వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్ కురి వాసుదేవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమారెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి వాసుదేవ్, జిల్లా సహాయ కార్యదర్శులు శీలం అశోక్, జూనుతుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.


స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్ రెడ్డి





