
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): గతంలో ఎన్నడు లేని విధంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు నిద్రాహారాలు మానేసి రేయి పగలు అని తేడా లేకుండా ఎండ వాన లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం సహకార సంఘాల ఎదుట పడి గాపులు కాస్తూనే ఉన్నారు. అదే సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల పరపతి సహకార సంఘం వద్ద ఆదివారం ఎదురయింది. సంఘానికి 350 బస్తాల యూరియా వచ్చింది. వ్యవసాయ పనులు వదిలేసి మరీ యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయానికి వేకువజమునే చేరుకొని ఆదివారం ఉదయం నుంచే వెన్కెపల్లి సహకార సంఘం ఎదుట రైతులు నిల్చునే ఓపిక లేక చెప్పులను క్యూలో పెట్టారు. భారీగా క్యూ లైన్ కట్టగా పోలీస్ బందోబస్తు మధ్యన రైతులకు టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. రోజుల తరబడి సహకార సంఘాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా రైతులందరికీ సరిపడా పంపిణీ చేసి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలుచున్న రైతులు..

నిలుచునే ఓపిక లేక క్యూలైన్లో చెప్పులు పెట్టిన రైతులు..

ఏలాంటి గొడవలు కాకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు..





