
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం భారీ సంఖ్యలో తెల్లవారుజామునుండే పురుష, స్త్రీ రైతులు వేచి ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవిల సమక్షంలో అధికారులు రైతులకు ఒక్కో బస్తా చొప్పున అందించారు. తెల్లవారుజాము నుండి రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్ద భారీగా గుమిగూడారు. చెప్పులతో లైన్ గా కొద్దిసేపు ఉంచారు. రైతులు భారీగా యూరియా కోసం వచ్చారన్న సమాచారం మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లారీ యూరియా లోడు రాగానే 780 బస్తాలను ఒక్కొక్కరికి పంపిణీ చేశారు. మిగతావారు నిరాశగా వెళ్ళిపోయారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి సింగిల్ విండోల చుట్టూ తిరగడం అవుతుందని వ్యవసాయ పనులు పక్కన పెట్టడంతో ఇబ్బంది జరుగుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ విండో పరిధిలోని జూపాక, బోత్తలపల్లి గ్రామాల రైతులకు యూరియా అందించడం లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు, పాలకవర్గం అనుచరులకు మాత్రమే అందజేస్తున్నారని పలువురు ఆరోపించారు. మిగతా రైతులకు కూడా యూరియా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.








