
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో మంగళవారం ప్రజల జీవన స్థితిగతులపై జాతీయ గణాంక శాఖ సర్వేను జాతీయ గణాంక శాఖ జిల్లా అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఉద్యోగులు కలిసి 12 కుటుంబాల జీవన స్థితిగతులపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాలలో ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే జరిపినట్లు ఆయన తెలిపారు. సర్వేలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో 12 కుటుంబాల గురించి సర్వే ప్రారంభించామని అన్నారు. తొలుత సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా 12 కుటుంబాలను ఎంపిక చేస్తామన్నారు. ఈ సర్వేలో కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు, వృత్తివిద్య కోర్సులు, స్వయం ఉపాధి తదితర అంశాలు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ తాసిల్దార్ కే కనుకయ్యకు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యలను కలిసి సర్వేకు సంబంధించినటువంటి కరపత్రాలను ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి ఎంపీఎస్ఓ జ్యోతి, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


సర్వే వివరాలను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు అందజేస్తున్న జిల్లా జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్…





