
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను 768 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే తరఫున సీపీ రాధా కృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (B.Sudershan Reddy) పోటీ చేశారు. ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావాల్సి ఓట్లు 377 కాగా.. రాధాకృష్ణన్కు 452 ఓట్లు, సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గెలుపొందిన అనంతరం రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోడీకి పుష్పగుచ్చాలిచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న రాధాకృష్ణన్..

రాధాకృష్ణన్ చేతిలో ఓటమిపాలైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..





