
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షము ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భారీ వర్షం మూలంగా ఇబ్బందులు పడ్డ మామిండ్ల వాడ, బుడగజంగాల కాలనీ, రెడ్డి కాలనీ, జమ్మికుంట రోడ్డు, గాంధీనగర్ లలో ఆయన పర్యటించి భారీ వర్షం మూలంగా జరిగిన నష్ట పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా చూసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ శివారులో ఉన్న గుండ్ల చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించారు. మోడల్ చెరువు ద్వారా వచ్చే నీటి వల్ల ఏఏ ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో తాము ఇబ్బంది పడ్డామని మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోరారు. హుజురాబాద్ ప్రాంతంలో అధిక వర్షం పడ్డ సందర్భంలో మామిళ్లవాడ, ప్రతాప్ వాడ, యాదవనగర్, బుడగ జంగాల కాలనీ, గాంధీనగర్, రెడ్డి కాలనీలలో ఇండ్లలోకి నీరు వస్తాయని ఈ ప్రాంతంలో మరోసారి ఇలా జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…ఇంతకాలం హుజురాబాద్ ప్రాంతంలో వర్షాపాతం సక్రమంగా కురవకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని కానీ గురువారం రాత్రి భారీ వర్షం వల్ల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు. వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. భారీ వర్షం కురిసిన వెంటనే హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఆర్డీవోను, తాసిల్దారును, మున్సిపల్ కమిషనర్ లతో తాను మాట్లాడి పునరావాస చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వర్షపు నీరు ఇళ్లలోకి రావడం వల్ల నష్టపోయిన పేదవారికి నిత్యవసర వస్తువులను అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజలు అధైర్యపడవద్దని, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ కే .సమ్మయ్య, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.







వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…





