
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ అక్టోబర్ 17: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్. గవాయ్ పై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటనపై నిందితుడు రాకేష్ కిషోర్పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలత నిరసన వ్యక్తం చేసి తాసిల్దార్ కనుకయ్యకు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అక్టోబర్ 7న సుప్రీం కోర్టులో వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది చీఫ్ జస్టిస్ గవాయ్ పై షూస్ విసరడం అత్యంత అనాగరికమని పేర్కొన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి, భారత రాజ్యాంగంపై దాడిగానే పరిగణించాల్సింది అన్నారు. దళితుడైన బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం కొందరు ఆధిపత్యవాద శక్తులు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జిలతో స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వము తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రారపు రాంచంద్రం, మారపేల్లి శ్రీనివాస్, రొంటాల రాజుకుమార్, మొలుగూరి ప్రభాకర్, దేవసాని ప్రియదర్శిని, ముక్క రమేష్, వెల్పుల విజయ్, మాడుగుల ఓదెలు, మొలుగు శ్రీనివాస్, మంద రాజు, తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.


నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి తాసిల్దార్ కనకయ్యకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు..





