
– ఇసుక మాఫియా అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలంలోని గుంపుల- శంభనపల్లి వాగుపై నిర్మించిన మానేరు చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ నాసిరకం పనుల వల్ల కూలిందా..? ఇసుక మాఫియా తమ వ్యాపారానికి అడ్డుగా చెక్ డ్యాం ఉందని కూల్చి వేసిందా ..? అనే విషయంపై నిజాలను నిగ్గు తేల్చాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని, అట్టి వారిపై పిడి యాక్ట్ పెట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. – శంభనపల్లి – గుంపుల చెక్ డ్యామ్ ను గుర్తుతెలియని దుండగులు కూల్చిన నేపథ్యంలో గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి చెక్ డ్యాం ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంభనపల్లి – గుంపుల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభానికి ముందే కూల్చి వేయడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అసలు చెక్ డ్యాం కాంట్రాక్టర్ నాసిరకం పనుల వల్ల కూలిందా, లేకపోతే సంఘవిద్రోహులు కూల్చి వేశారా అనే విషయంపై సమగ్ర విచారణ , దర్యాప్తు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ తప్పిదం వల్ల చెక్ డ్యామ్ కూలితే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి, ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఇసుక కోసం చెక్ డ్యాం బ్లాస్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నందున ఇక్కడి ప్రాంతంలోని ఇసుక మాఫియా అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం కూల్చివేతతో ఇక్కడి ప్రాంతంలోని అనేక గ్రామాల వ్యవసాయం , పంటల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. చెక్ డ్యాం కూల్చివేతతో ఆయా ప్రాంతాలలో వేల ఎకరాలకు అవసరమైన సాగునీటిసరఫరా నిలిచిపోయిందని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మానేరు చెక్ డ్యాం ను కూల్చాల్సిన అవసరం ఎవరికుంది..? కూల్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది..? ఎవరికి ఈ ధైర్యం ఉంది ..? అనే అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు తక్షణం రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు, విచారణ జరిపి దుండగులపై కఠిన చర్యలు చేపట్టి చెక్ డ్యామ్ ను పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి బిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, కొలకాని కొలకాని రాజు, బత్తిని నరేష్, తూర్పాటి రాజు, రాముడి ఆదిరెడ్డి, రావుల సంపత్, మేడిపల్లి సంపత్, సమ్మిండ్ల విజేందర్, బచ్చు శివకుమార్, కొండల్ రెడ్డి, పొన్నగంటి రవికుమార్, రమణాకర్ రెడ్డి, సమ్మయ్య, హరీష్, సత్తయ్య, తిరుపతి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, విజయ్, ప్రభాకర్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.



ధ్వంసమైన గుంపుల- శంభనపల్లి వాగుపై నిర్మించిన మానేరు చెక్ డ్యామ్ ను సందర్శించి పరిశీలిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..






