
– కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి
– స్థానిక ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలి – బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో ముందుకు వెళ్లాలి
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి:
నిన్న ఆత్మహత్యకు పాల్పడి ఈ రోజు మరణించిన సాయి ఈశ్వరాచారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఆరోపించారు.
శుక్రవారం నాడు ఆయన విద్యానగర్ బీసీ భవన్లో, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డా. ర్యాగా ఋషి అరుణ్కుమార్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంవల్లనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన తల్లి గర్భ శోకాన్ని ఎవరు తీర్చగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలహీన వర్గాల యువత, విద్యార్థుల మరణాలు పరంపరగా కొనసాగుతున్నాయని, ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు రావాలని, ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డా. ర్యాగా ఋషి అరుణ్కుమార్ మాట్లాడుతూ “ఇంకా ఎంత మంది తమ హక్కుల సాధన కోసం ప్రాణాలు తీసుకోవాలని?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఆచరణలో పెట్టడం కనీస కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని హెచ్చరించారు. హక్కులు సాధించే వరకు అవిశ్రాంతంగా ఉద్యనిస్తామని ఆయన స్పష్టం చేశారు. “రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అజెండా అంటే ఇదేనా?” అని అరుణ్ విమర్శించారు. బీసీ హక్కుల సాధనకు — ఢిల్లీ వేదికగా ఐక్య కార్యాచరణ చేపదుతున్నామని, AICC కార్యాలయంను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో జాతీయ వైస్ ప్రెసిడెంట్ గుజ్జా సత్యం, నీల వెంకటేష్, సి. రాజేందర్, సతీష్, రాజు నేత, అనురాధ గౌడ్, జి పద్మా తదితరులు పాల్గొన్నారు.


మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు






