
– 2 ఏళ్ళలో ప్రతీ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి.
– కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి మరిన్ని నిధులు.
– బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు హుజురాబాద్ అభివృద్ధికి విరోధకులు.
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రణవ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (కమలాపూర్): ఈనెల 11,17వ తారీఖున జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పనిచేసే అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, ఉప్పలపల్లి, అంబాల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రణవ్ కు ఘన స్వాగతం పలికారు. అభ్యర్థుల కోసం గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా, తమ దృష్టికి వచ్చిన సమస్యలు నేరుగా పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి, ఇంటికి చేరవేసే బాధ్యత తాను తీసుకుంటామని అన్నారు.

బీజేపీ,బీఆర్ఎస్ హుజురాబాద్ అభివృద్ధి నిరోధక పార్టీలు..
హుజురాబాద్ అభివృద్ధి పట్ల కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని, సెంటిమెంట్ డైలాగులు, చస్తా అని బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప హుజురాబాద్ కు చేసింది ఏం లేదని, రెండేళ్లుగా ప్రజల మధ్యలో ఉంటూ, ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా గెలిచినా, ఓడినా మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చినట్టుగా అవకాశం ఉన్న ప్రతి చోట తన వంతు సహాయం అందజేస్తున్నానని అన్నారు.

2 ఏళ్లుగా మీ స్థానం ఎక్కడ?
2 సంవత్సరాల్లో హుజూరాబాద్ ప్రజల గురించి పట్టించుకున్న నాధుడు లేడని, ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం హుజూరాబాద్ వైపు వస్తున్నారని, ఎమ్మెల్యే ఎన్నికైన నాటి నుండి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ గడ్డకు రూపాయి నిధులైన తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు?. కౌశిక్ రెడ్డి తన వింత ప్రవర్తన వల్ల హుజురాబాద్ నియోజకవర్గ పరువు తీస్తున్నాడని, గతంలో 2 ఏళ్లుగా ఎమ్మెల్సీగా, విప్ గా ఉండి హుజురాబాద్ కి ఏం చేయలేకపోయాడని ఇప్పుడు ఎమ్మెల్యే గా రీల్స్ చేసుకుంటూ గడుపోతున్నాడనీ, ఎమ్మెల్యేనే ఏం చేయనప్పుడు ఆ పార్టీ అభ్యర్థులు ఏం చేస్తారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మీ గడపకు,గడపకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వస్తుందనీ, పదేళ్లలో ఇవ్వలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చామనీ, ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల సమయంలో లబ్ధిదారులు భావోద్వేగానికి లోనవుతుంటే వారి ఆవేదనతో బీఆర్ఎస్ ఆడుకుందని,పదేళ్లలో ఇల్లిస్తాం అని మాయ మాటలు చెప్పి ఓట్లించుకున్నారే తప్ప కనీసం కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పంచలేదనీ, ఇది బిఆర్ఎస్ నాయకుల పనితీరనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల నాయకులు, గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…

ప్రణవ్ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, ఓటర్లు…





