Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష వున్నందున ఆ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పై కారణంగా వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.
ఏపీపీ రాత పరీక్షా కేంద్రాలను కేవలం హైదరాబాద్ లోనే నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని, ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన (ఆర్టికల్ 326) రాజ్యాంగపు హక్కు అంతే కాకుండా ప్రాథమిక హక్కు అయినటువంటి భావ ప్రకటనా స్వేచ్ఛలో( 19(1)(a)) భాగంగా అంతర్లీనంగా ఇమిడి వుందని ఆయన వివరించారు. కావున న్యాయం కోసం పోరాడే న్యాయవాదుల సమస్య పట్ల వెంటనే స్పందించి APP రాత పరీక్షను వాయిదా వేసి న్యాయవాదులు అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పునరాలోచన చేయాలని ముక్కెర రాజు కోరారు.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు





