
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపల్ చైర్మన్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడంతో ప్రధాన పార్టీల నుండి ఆ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి అనేకమంది దళిత మహిళలు వివిధ పార్టీల నుండి పోటీ చేయడం ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
అందులో భాగంగా హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని 7వ వార్డు నుండి గన్నారపు వినీత-శ్రీకాంత్ రంగంలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి అడుగుపెడుతుంది.
గ్రామీణ ప్రజలకు… నిరుపేదలకు సేవ చేయాలని… ప్రతి పనిని మానవతా కోణంలో ఆలోచించి అమలు చేయాలని సంకల్పంతో తాను 7వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు వినీత వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని.. తనను గెలిపించినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య తనదిగా భావించి పరిష్కరిస్తానని ఆమె ఈ సందర్భంగా ఓటర్లకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తాను పోటీ చేస్తున్న విషయం తెలియగానే వివిధ వర్గాలకు తమ వార్డుకు చెందిన మహిళలు… యువకులు.. కలిసి మద్దతు తెలపడం తనకు కొండంత బలాన్ని ఇచ్చినట్లుగా ఆమె వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు ఆలోచించుకోవాలని… తాత్కాలికమైన భ్రమలకు లోను కావద్దని… ఐదు సంవత్సరాల పాటు తమకోసం ఎవరు అండగా నిలుస్తారో గుర్తించి అలాంటి వారికి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని… సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. తమ నాయకుడు వోడితెల ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లి తాను అనుక్షణం పని చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలు, ఓటర్లు ప్రతి ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చి చూడాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. తాను ఏమిటో గెలిపించిన తర్వాత చేసి చూపిస్తానని… ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యురాలుగా పెద్దదిక్కుగా ఉంటానని పేర్కొన్నారు. అనూహ్యంగా 7వ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించినట్లయితే చైర్మన్ పీఠం విషయంలో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆమెకు ఈ పీఠం దక్కాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్ ల మద్దతు లభించ వలసిన అవసరం ఉంటుంది కనుక ఈ విషయంలో ఎంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రధాన పార్టీలకు మెజారిటీ స్థానాలు లభించకపోతే… బిజెపి అభ్యర్థులు కొంతమంది… కొన్నిచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్ధులు అనూహ్యంగా విజయం సాధిస్తే వీరంతా చివరి నిమిషంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆ పరిణామంలపై ఈమె భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వినీత అంచనాల ప్రకారం హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని ఆమెగట్టి విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఓట్ల లెక్కింపు రోజు… ఆ తర్వాత జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికి ఏడవ వార్డులో గెలుపు బాటలో దూసుకు పోతున్న వినీత ప్రచారంలో అందరికంటే ముందు వరుసలో ఉండి అందరి దృష్టిని ఆకర్షించడం కోస మెరుపు.



ఏడవ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న గన్నారపు వినీత – శ్రీకాంత్





