
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఓసిల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసిల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఓసి జేఏసీ రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ , వరంగల్ జిల్లాల నాయకుల తో కలిసి ఈనెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసిల మహాధర్నా విజయవంతం చేయాలని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఢిల్లీ ప్రయాణ ఏర్పాట్లపై సమీక్షించి సమన్వయ కర్తలను నియమించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రకుల పేద సామాజిక వర్గాలలోని పేద విద్యార్థినీ విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ విషయాల్లో జరుగుచున్న అన్యాయాన్ని పరిష్కరించుకునే దిశగా అన్ని వర్గాల ప్రజల పక్షాన దేశం నడి ఒడ్డున జరుగుచున్న ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ధర్నా నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కను విప్పు కలిగే విధంగా ఉంటుందని రామారావు తెలియజేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, ప్రస్తుతం 50 శాతం పెంచకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలని, రైతులకు రైతు భీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.. ఈ డిమాండ్ల ప్రతులను ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులకకు పంపించామని తెలిపారు. ఈ ధర్నాలో ఢిల్లీలోని జేఎన్ టీయూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పక్కన ఉన్న ఫరీదాబాద్, యూపి ప్రాంతాల జాట్ నేతలు పాల్గొంటున్నట్లు హై ప్రొఫైల్ లెవల్ లో ధర్నా ప్రాంతం దద్దరిల్లి బోతుందని రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణు గోపాల్ రావు, ప్రథాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, ఓసి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి నాయకులు గండ్ర సంపత్ రావు, బల్మూరి ప్రసాద్ రావు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఐకాస నాయకులు చందుపట్ల నరసింహరెడ్డి, జనగామ కరుణాకర్ రావు , శశిధర్ రెడ్డి, నాయకులు పీచర నరేందర్ రావు, గండ్ర భాస్కర్ రావు, మిర్యాల భూపతిరావు, చీటి అశోక్ రావు, కలకుంట్ల శ్రీపతిరావు, ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొత్తకొండ రవీందర్ రావు, దేవరాజుల మనోహర్ శర్మ, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల నాయకులు తాటిపల్లి రాజన్న, అంచూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఓసి ఐకాస తరపున ఒక ఓసి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జాతి నెపమున కించపర్చుతూ వారి మనోభావాలను అగౌరపర్చుతూ ఓసిల ఐక్యతకు గొడ్డలి పెట్టులా మారిన బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన బాధ్యతా రాహిత్యపు అనుచిత వ్యాఖ్యలను ఓసి ఐకాస తరపున తీవ్రంగా ఖండిస్తూ ఆయన బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో నాయకులు ఫంక్షన్ హాల్ నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సిఎం వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. సిఎం రేవంత్ వ్యాఖ్యలు దిగజారుడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. తాజా మాజీ సిఎంపై మీకు రాజకీయ వైరుధ్యాలు ఉండటాన్ని మేము తప్పు పట్టడం లేదు అది రాజకీయాల్లో మీరు మీరు క్షేత్ర స్థాయిలో విది విధానాల మీద హుందా తనంగా సద్ విమర్శలు చేసుకోండి కానీ అదే సామాజిక వర్గీయులైన ఇతర మాజీ ప్రజా ప్రతినిధులతో సహా వారి జాతి మొత్తాన్ని కించపరిచే సీఎం రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలు సరికాదు. ఇదే ముఖ్యమంత్రి ఉన్న పార్టీ లో పెద్దలు దివంగత మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి , వై ఎస్ రాజశేఖరరెడ్డి సీఎంలుగా భేషుగ్గా అందరిని కలుపు కొని పరిపాలన సాగించి మన్ననలు పొందారన్నారు.
మరో మైనారిటీ ఓసి సామాజిక వర్గానికి చెందిన పెద్దలు దివంగత నేత పీవీ నరసింహారావు ఉమ్మడి ఏపీ సీఎం గా దేశ ప్రధానిగా పరిపాలన సాగించి మన్ననలు పొండలేదా, పెద్దలు దివంగత మహానేత జువ్వాడి చొక్కారావు, చలిమెడ ఆనందరావు, దివంగత నేతలు సుధాకర్ రావు, పురుషోత్తంరావు, చకిలం శ్రీనివాస్ రావులు మంత్రులుగా హుందాగా వ్యవహరించారని, ప్రజా క్షేత్రంలో దివంగత నేత వెలిచాల జగపతిరావు లాంటి నేతల వైఖరి భేష్ అని తెలంగాణ ప్రజలు మెచ్చుకోలేదా అప్పుడు మీరెక్కడ ఉన్నారు మిస్టర్ సిఎం రేవంత్ రెడ్డి అని రామారావు మండిపడ్డారు. ఇంతెందుకు గతంలో కేసీఆర్ ను మీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ భూమిక ప్రధానమైనదని పొగుడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి వెలమ జాతి నెపంతో ఆ సామాజిక వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసి కించపరిచే వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట దురదృష్టకరం సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవి కుర్చీకే తలవంపులు తెచ్చారని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించాలని లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని హెచ్చరించారు.


చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఇతర నాయకులు..







