
–రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
పాలకులు రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడ మేమిటని ప్రశ్నించారు. ముఖ్యంగారైతులకు ,కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల లో ఎందుకు జాప్యం చేస్తోంది అని నిలదీశారు. రైతు భరోసా నిధుల కోసం సమీకరించిన 9 వేల కోట్ల రూపాయల లోంచి 4 వేల రూపాయలను కమిషన్ లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.
ఇటీవలే ఒక అమాత్యుడి కుమారుడి పెండ్లి కోసం కాంట్రాక్టర్లు కమిషన్ లు ఇచ్చారని అందుకే రైతు బందు కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. పంట పెట్టుబడి సహాయం కోసం ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని మరో 15 రోజుల్లో అట్టి పంటలు కోతకు వస్తున్నాయని ఇంకెప్పుడు నిధులు విడుదల చేస్తారని రామారావు ప్రశ్నించారు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టరు కార్యాలయాలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్ష మందితో రైతు మహాగర్జన సమర భేరి సభ నిర్వహించనున్నట్లు పోలాడి ప్రకటించారు. శుక్రవారం నగరంలోని హిమాయత్ నగర్ ఐకాస కార్యాలయంలో మహాగర్జనకు సంబంధించి ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ వివరాలను రామారావు మీడియా కు వివరాలు వెల్లడించారు. రామారావు మాట్లాడుతూ రైతుల పంటలపై ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయరంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడం తో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, ఆర్ధికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకు వస్తామని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
పార్టీల కతీతంగా అందరినీ సభకు ఆహ్వానిస్తామని అన్ని జిల్లాలనుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారే సంఖ్యలో తరలి వచ్చేలా చూస్తామన్నారు. ఈ సన్నాహక కార్యక్రమంలో ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు పట్ల నర్సింహారెడ్డి,
రైతు మిత్ర ప్రజా సంఘాల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, రాష్ట్ర నాయకులు అయిత నాగరాజు, కొత్తకొండ రవీందర్ రావు వివిధ జిల్లాల ఐకాస, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో ఓసి ఐకాస, ప్రజా సంఘాల ప్రతినిధులు తో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు.






