
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని హుజురాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ అన్నారు. శుక్రవారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన 47 మంది మహిళలను వారు సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రాచీన కాలంలో మహిళలు విద్యకు దూరంగా ఉండటం వల్ల అన్ని రంగాల్లో ముందుకు రాలేకపోయారని నేటి సమాజంలో మహిళలు విద్యారంగంలో ముందున్నారని అన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు ఇతర బాధ్యతలను కూడా పూర్తి చేస్తుండడం వల్లనే కుటుంబంతో పాటు సమాజం బాగుపడుతుంది అన్నారు.

అనంతరం హుజురాబాద్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీణ ప్రణతి మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించడం అభినందనీయమన్నారు. మహిళలు ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ పురుషులకు దీటుగా ఉన్నారని అన్నారు. సమాజ ప్రగతిని మహిళలు నిర్దేశిస్తున్నారన్న విషయం గమనించాలనే అన్నారు. కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలోని మహిళ విద్యావంతురాలు కావాలని అన్నారు. బ్రహ్మకుమారి కల్పన మాట్లాడుతూ… కుటుంబంలో మహిళ పాత్ర ఎనలేనిదని క్రమక్రమంగా మహిళల ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారని అన్నారు. మహిళలు తమ అభ్యున్నతి కోసం వివిధ రకాల బాధ్యతలను పోషిస్తున్నారని అటువంటి సమయంలో వారికి ధ్యానం అవసరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి విద్యాలయ బాధ్యులు గుంటి రాజయ్య శివరాత్రి ఈశ్వరయ్య, వివిధ వర్గాలకు చెందిన మహిళ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ

ఉపాధ్యాయుని హరితను సన్మానిస్తున్న దృశ్యం..

సన్మానం పొందిన వివిధ రంగాల మహిళా ఉద్యోగులు..





