
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచేందుకు హుజురాబాద్ మండలం సింగాపూర్కు చెందిన జయన్న ఫౌండేషన్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11వ తేదీన హుజురాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఈ సహాయ పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది.
ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్
ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖాధికారి (DEO)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ అశ్విని తానాజీ వాకడే గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జయన్న ఫౌండేషన్ చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆమె స్వయంగా విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయనున్నారు.
300 మంది విద్యార్థులకు అండగా..
హుజురాబాద్ మండలంలోని 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న సుమారు 300 మంది నిరుపేద విద్యార్థులను గుర్తించి, వారికి పరీక్షల సమయంలో రవాణా, అల్పాహారం మరియు ఇతర ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 700/- చొప్పున నగదును ఫౌండేషన్ అందజేయనుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా ఇప్పించనున్నారు.
కొనసాగుతున్న సేవా యజ్ఞం.
గత రెండేళ్లుగా విద్య మరియు వైద్య రంగాల్లో జయన్న ఫౌండేషన్ నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. గతంలో 4000 మందికి ఎగ్జామ్ కిట్ల పంపిణీ, 5000 మందికి కంటి పరీక్షలు, మరియు 1289 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి తన మానవత్వాన్ని చాటుకుంది. అలాగే 24 గంటల ఉచిత అంబులెన్స్ సేవలను కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంచింది.
విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.





