
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంత ప్రజారోగ్యానికి నష్టం కలిగించే విధంగా ఉన్న డంపింగ్ యార్డ్ ఏర్పాటు ను ప్రభుత్వం వెనక్కి పంపే వరకు మీతో ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు నిరసిస్తూ ఐదో రోజు చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చి దీక్ష చేస్తున్న నాయకులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని అన్నారు. హుజురాబాద్ ప్రాంత ప్రజలకు డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అన్న విషయాన్ని ప్రభుత్వానికి అసెంబ్లీలో అన్ని విషయాలను వివరించాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే డంపింగ్ యార్డ్ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు అఖిలపక్షం నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా తాను పాలు పంచుకుంటానని ప్రభుత్వంతో పోరాడుతానని అన్నారు. ప్రజలకు నష్టం కలిగే ప్రాజెక్టును తప్పనిసరిగా అందరం కలిసి అడ్డుకుందామని ఆయన అన్నారు. ప్రాజెక్టు రావడానికి తాను సంతకం పెట్టానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తన సంతకం ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మీతో పాటు నేను కలిసి ఉంటానని, అందరం కలిసి సాధిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పి ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గుడిపాటి జైపాల్ రెడ్డి, బండ శ్రీనివాస్, ఎడవల్లి కొండల్ రెడ్డి, పోల్సాని రామారావు, ఎడ్ల విజయ్ కుమార్, వర్ధినేని రవీందర్రావు, వేల్పుల ప్రభాకర్, బెల్లి రాజయ్య, ఆరేపల్లి ఎల్లయ్య, గఫార్, డాక్టర్ శేఖర్, సురేందర్ రెడ్డి, సందెల వెంకన్న, తాళ్లపల్లి శ్రీనివాస్, చందుపట్ల జనార్ధన్, లక్ష్మణమూర్తి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


దీక్షా శిబిరం వద్దకు వచ్చి దీక్ష చేస్తున్న నాయకులకు సంఘీభావం ప్రకటిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి





