Oplus_16908288
—ఇప్పటికే పలు బస్ సర్వీసులు ప్రారంభం.
—మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ప్రణవ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులకు ఆమోదం తెలపాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దాంతో పాటు హుజూరాబాద్ డిపో పరిధిలో బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని కోరగా, సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ అంశాన్ని పరిశీలించి వీలైనంత త్వరలో సర్వీసులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే బేతిగల్ టు కరీంనగర్, మర్రిపల్లిగూడెం నుండి హైదరాబాద్, జమ్మికుంట నుండి హైదరాబాద్ డైరెక్ట్ సర్వీసులు ప్రారంభం కాగా ఇంకొన్ని ప్రాంతాలకు కూడా నూతన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, గూడూరి స్వామిరెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు…






